చెన్నై: ఒక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ఒకరు తొలగించారు. దీంతో దీనిపై వివాదం రాజుకుంది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. వెల్లలూరు పట్టణ పంచాయతీ కార్యాయంలోని ఎగ్జిక్యూటివ్ అధికారి గదిలో బీజేపీ వార్డు సభ్యులు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ఏర్పాటు చేశారు. వార్డు సభ్యుడు కనకరాజ్ దీనిని గమనించి తొలగించాడు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన అధికార డీఎంకేకు మద్దతుగా ఉన్నారు. మరోవైపు బీజేపీ వార్డు సభ్యులు దీనిపై పోతనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ ఫొటో తొలగించిన కనకరాజ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, పంచాయతీ కార్యాలయం నుంచి ప్రధాని మోదీ ఫొటో తొలగించడం ఇదే తొలిసారి కాదు. తమిళనాడులోని మరో పంచాయతీ కార్యాలయంలో కూడా ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. అలాగే బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కూడా ఇలాంటి తరహా సంఘటన జరిగింది. ఒక వ్యక్తి అద్దె ఇంట్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టుకున్నాడు. గమనించిన ఇంటి యజయాని దానిని తొలగించకపోతే ఇంటి నుంచి గెంటివేస్తానని హెచ్చరించాడు. దీంతో ఆ వ్యక్తి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.