చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా లోపంపై కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ పాకిస్థాన్ కాల్పుల పరిధిలో ఉన్నారని తెలిపారు. ప్రధాని మోదీకి ఎలాంటి ముప్పు లేదన్న పంజాబ్ సీఎం చరణ్జిత్ చన్నీ వ్యాఖ్యలను ఆయన ఈ మేరకు ఖండించారు. మీడియాతో శుక్రవారం మాట్లాడిన మనీష్ తివారీ, ప్రధాని భద్రతను మరొకరి భద్రతతో పొల్చడం సరికాదన్నారు. ‘ప్రధాని కాన్వాయ్ ఎక్కడ ఆగింది. ఇండో-పాక్ సరిహద్దు నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో అది ఉంది. సాధారణంగా సరిహద్దు వద్ద పాకిస్థాన్ భారీ ఫిరంగిని మోహరిస్తుంది. మన తుపాకులు కూడా సరిహద్దులో ఉన్నాయి. ఫిరంగి దళాల పరిధి 35-36 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ. కాబట్టి, దేశ ప్రధానిని మరొకరి భద్రతతో పోల్చడం నా మనస్సాక్షికి తగినది కాదు’ అని అన్నారు.
అయితే ప్రధాని మోదీ భద్రతలో ఎలాంటి లోపం లేదని మనీష్ తివారీ తెలిపారు. రైతుల నిరసన జరుగుతున్నందు వల్లనే ప్రధాని కారును 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్పై నిలిపివేశారని చెప్పారు. ఇది భద్రతా లోపం కిందకు రాదన్నారు. అయితే పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ప్రధాని మోదీ ఉన్నందున ఆయనకు ఆ మేరకు ముప్పు పొంచి ఉందన్నారు.
కాగా, బుధవారం పంజాబ్లో ఎన్నికల సభలో పాల్గొనేందుకు ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో సభా స్థలానికి బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ, రైతుల నిరసనతో ఫిరోజ్పూర్ ఫ్లైవోవర్పై 20 నిమిషాలపాటు కారులోనే ఉండిపోయారు. అనంతరం తిరిగి ఎయిర్పోర్ట్కు చేరుకుని ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో తలెత్తిన లోపాలపై కేంద్ర ప్రభుత్వంతోపాటు బీజేపీ నేతలు పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై దీనిపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.