డెహ్రాడూన్: ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 5వ తేదీన కేదార్నాథ్ వెళ్లనున్నారు. అక్కడ ఆయన ఆది శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. డెహ్రాడూన్లో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ.. గడిచిన నాలుగేళ్లలో ఉత్తరాఖండ్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చోటుచేసుకున్నట్లు చెప్పారు. సీఎం పుష్కర్ సింగ్ ధామీ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేపట్టేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. కోవిడ్19, వరదల సమయంలో కాంగ్రెస్ నేతలు కనిపించలేదని, కానీ ఎన్నికల వేళ మీడియా సమావేశాలకు ఆ నేతలు వస్తున్నట్లు షా ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలు, నెరవేర్చిన హామీల గురించి చర్చించేందుకు ముందుకు రావాలని మాజీ సీఎం హరీశ్ రావత్కు సవాల్ విసిరారు. మేనిఫెస్టోలో 85 శాతం హామీలను నిజం చేశామన్నారు. ప్రకృతి విపత్తు సంభవిస్తుందని తెలియగానే, చార్ ధామ్ యాత్రను నిలిపేశామని సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ముందు జాగ్రత్తగా ఆదేశాలు ఇవ్వడం వల్ల, యాత్రికుల ప్రాణాలను కాపాడినట్లు ఆయన చెప్పారు.