న్యూఢిల్లీ : దేశంలో వ్యాక్సిన్ డోసుల పంపిణీ వంద కోట్ల మార్క్ దాటిన నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మోదీ పరిశీలించారు. హెల్త్ కేర్ వర్కర్స్తో పాటు ఓ దివ్యాంగురాలితో మోదీ మాట్లాడారు. ప్రధాని మోదీ ఆస్పత్రి అంతా కలియతిరుగుతూ సెక్యూరిటీ గార్డ్స్ను ఆప్యాయంగా పలుకరించారు. ఆస్పత్రి సిబ్బందికి ప్రధాని మోదీ విజయ సంకేతం ఇచ్చారు.
దేశవ్యాప్తంగా వంద కోట్ల కోవిడ్ టీకా డోసులను పంపిణీ చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇండియా చరిత్ర సృష్టించినట్లు ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. భారతీయ సైన్సు, వ్యాపారంతో పాటు 130 కోట్ల మంది భారతీయుల స్పూర్తికి ఇది సాక్ష్యమని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్లో వంద కోట్లు దాటిన నేపథ్యంలో దేశ ప్రజలకు ఆయన కంగ్రాట్స్ తెలిపారు. ఈ అద్భుతమైన ఘనత సాధన కోసం కృషి చేసిన డాక్టర్లు, నర్సులు, అందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు.