PM Modi to visit Kedarnath : ప్రధాని నరేంద్రమోదీ వచ్చే నెల 5న ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్కడ పునర్నిర్మించిన శ్రీ ఆదిశంకరాచార్య సమాధికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత ఆదిశంకరాచార్యుడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రధాని కార్యాలయం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. కేదార్నాథ్లోని ఆదిశంకరాచార్యుడి సమాధి 2013లో వచ్చిన భారీ వరదల వల్ల ధ్వంసమైంది.
ఉత్తరాఖండ్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా ఆ రాష్ట్రంలో ఇటీవల రూ.130 కోట్ల ఖర్చుతో పూర్తిచేసిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఒక బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అదేవిధంగా మరో రూ.180 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.