న్యూఢిల్లీ: బెంగాల్లోని సందేశ్ఖాలీలో మహిళలను స్థానిక టీఎంసీ నేత వేధించిన విషయం తెలిసిందే. ఆ సంఘటన ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నది. అయితే మార్చి 6వ తేదీన ప్రధాని మోదీ(PM Modi) బెంగాల్లో టూర్ చేయనున్నారు. ఆ రోజున ఆయన సందేశ్ఖాళీ మహిళా బాధితుల్ని కలుసుకోనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మహిళా వింగ్తో జరనున్న భేటీలో పాల్గొననున్న మోదీ.. అదే సమయంలో సందేశ్ఖాలీ బాధితుల్ని కలుసుకుంటారు.
నార్త్ 24 పరగనాస్ జిల్లాలోని సందేశ్ఖాళీలో టీఎంసీ నేత మహిళల్ని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ నేతకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించారు. దీంతో ఆ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. టీఎంసీ నేత షేక్ షాహజహాన్ , అతని అనుచరులు దుర్మార్గాలకు పాల్పడ్డారు. భూములు లాక్కున్నారు. బెదిరింపులకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే డబ్బును లాగేసుకునేవారని ఆ ముఠాపై ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఇటీవల ఈడీ అధికారులు అతని ఇంటి వద్దకు తనిఖీ కోసం వెళ్లారు. ఆ సమయంలో అధికారులపై అటాక్ జరిగింది. ప్రస్తుతం ఆ టీఎంసీ నేత పరారీలో ఉన్నాడు.