న్యూఢిల్లీ : ఈ నెల 13వ తేదీన సాయంత్రం 5 గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సీఎంలతో మోదీ సమీక్షించనున్నారు.
దేశంలో పలు రాష్ట్రాల్లో వైరస్ కట్టడికి విధించిన ఆంక్షలపై చర్చించనున్నారు. రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ తీరుపై సమాలోచనలు జరపనున్నారు. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో కట్టడి చర్యలను సూచించనున్నారు. ఆదివారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో కొవిడ్ పరిస్థితులపై చర్చించిన ప్రధాని మోదీ వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించారు. కరోనాను అడ్డుకునేందుకు వ్యాక్సిన్ వేసుకోవడమే ఉత్తమమని మోదీ పేర్కొన్నారు.
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షపైగా కరోనా కేసులు నమోదవుతూ ఆందోళన పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దేశవ్యాప్తంగా 1,68,063 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.