Modi | భారత్లో పెట్టుబడులు పెట్టడానికే ఇదే సువర్ణ అవకాశమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న సవాళ్లను తాను పూర్తిగా అర్థం చేసుకోగలనని, కానీ.. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మెరుగుపరుస్తున్నామని ప్రకటించారు. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ దావోస్ ఎజెండా’ సమావేశంలో మోదీ వర్చువల్గా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యంత అవగాహనతో, సంపూర్ణమైన సంస్కరణలు చేయడం ద్వారా పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్ మారుతోందని ప్రకటించారు. తమ సంస్కరణలకు ప్రపంచ ఆర్థిక నిపుణులు కూడా కితాబునిచ్చారని, ప్రపంచం తమపై ఉంచిన ఆకాంక్షలను తప్పకుండా నెరవేరుస్తామని మోదీ హామీ ఇచ్చారు.
ప్రపంచ సరఫరా గొలుసులో నమ్మకమైన భాగస్వామిగా ఉండేందుకు కూడా భారత్ చేస్తున్న ప్రయత్నాలను కూడా మోదీ ఈ సందర్భంగా వివరించారు. అలాగే పెట్టుబడులు, ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ఈ వేదిక ద్వారా మోదీ ప్రకటించారు. పీఎం గతిశక్తి పథకం ద్వారా దాదాపు 14 రంగాల్లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల కోసం 26 బిలియన్ డాలర్లను ప్రకటించామన్నారు. ఇలాంటి మోడల్తో ఉన్న పెట్టుబడులే సుస్థిరతను చేకూరుస్తాయని అభిప్రాయపడ్డారు.
2014 లో కేవలం కొన్ని వందల్లోనే స్టార్టప్ కంపెనీలు నమోదయ్యాయని, ఇప్పుడు వాటి సంఖ్య 60 వేలకు చేరిందని మోదీ తెలిపారు. గత ఆరు నెలల్లోనే 10 వేలకు పైగా స్టార్టప్ కంపెనీలు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాయని వివరించారు. దాదాపు 50 లక్షలకు పైగా సాఫ్ట్వేర్ డెవలపర్స్ పనిచేస్తున్నారని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఫార్మా ఉత్పత్తిలో భారత్ మూడో స్థానంలో నిలిచిందని, కరోనా సమయంలో తాము పాటించిన వన్ ఎర్త్, వన్ హెల్త్ విధానం ఎందరికో ప్రాణం పోసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అత్యవసర సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్లు, అత్యవసర ఔషధాలను కూడా సరఫరా చేశామని మోదీ పేర్కొన్నారు.