లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం యూపీలోని పలు ప్రాంతాల్లో వర్చువల్ ర్యాలీలతో ప్రచారాన్ని హోరెత్తించారు. బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణతో కొంతమందికి కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను ఉద్దేశించి ప్రధాని మోదీ చురకలు వేశారు. తనకు శ్రీకృష్ణుడు కలలో కనిపించి అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ గెలుపు తథ్యమని చెప్పారని అఖిలేష్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇక గత పాలకులు యూపీ ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారని ప్రధాని మోదీ విమర్శించారు. యూపీలోని మధుర, ఆగ్రా, బులంద్షహర్ల్లో వర్చువల్ ర్యాలీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రజల అవసరాలను గత పాలకులు గాలికొదిలేశారని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వంలో దళితులు, అణగారిన వర్గాల వారు, పేదలు, మహిళలు, వ్యాపారవేత్తలు సహా ప్రతిఒక్కరూ పలు పధకాలతో లబ్ధి పొందారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం కోసం యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వాన్ని యూపీ ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని అన్నారు.
కాగా పిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఇక లెజెండరీ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దిగ్గజ గాయని మరణంతో బీజేపీ మేనిఫెస్టో విడుదల సహా పలు కార్యక్రమాలను రద్దు చేసుకుంది. రెండు రోజుల సంతాపదినాలను ప్రకటించింది. లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం ముంబై చేరుకోనున్నారు.