న్యూఢిల్లీ: దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడంలో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసినట్లు ప్రధాని మోదీ అన్నారు. భారత్ ఆత్మనిర్భర్గా మారిందని, స్వయం సమృద్ధిగా ఎదిగిందన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్సెస్ కావడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించినట్లు ఆయన తెలిపారు. ఇక కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో వ్యాక్సిన్లు, బెడ్ల కొరత ఉన్నట్లు వచ్చిన వార్తలను మోదీ కొట్టిపారేశారు. అవి కేవలం విమర్శలు మాత్రమే అని అన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఉన్న వయోజన జనాభాలో 69 శాతం మంది కనీసం ఒక డోసు అయిన వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 25 శాతం మంది మాత్రం రెండు డోసుల టీకాలు తీసుకున్నట్లు చెప్పారు. ఇదే రీతిలో డిసెంబర్ చివరి కల్లా యావత్ దేశాన్ని వ్యాక్సినేట్ చేయనున్నట్లు చెప్పారు. ఓపెన్ మ్యాగ్జిన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను మోదీ షేర్ చేసుకున్నారు. ఒకవేళ మన దేశం వ్యాక్సిన్ తయారు చేయలేదనుకుంటే, అప్పుడు మరి పరిస్థితి ఏంటన్నారు. ఇప్పటికీ కోవిడ్ వ్యాక్సిన్ అందని దేశాలు ఉన్నాయన్నారు. భారత్ ఆత్మనిర్భర్ కావడం వల్లే వ్యాక్సినేషన్లో సక్సెస్ సాధించినట్లు ప్రధాని తెలిపారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ మంత్రాన్ని జపించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం పరిశోధనలకు పెద్ద పీట వేస్తుందన్నారు.
వ్యాక్సిన్ల కొరత ఉందని, సెకండ్ వేవ్ సమయంలో బెడ్లు, మెడిసన్లు అందకపోవడం వల్లే ఏప్రిల్-మే సమయంలో ఇన్ఫెక్షన్లు పెరిగినట్లు వస్తున్న ఆరోపణలపై మోదీ స్పందించారు. విమర్శలు వేరు, ఆరోపణలు వేరన్నారు. చాలా వరకు జనం ఎక్కువగా ఆరోపణలు మాత్రమే చేస్తారని, కానీ విమర్శలు చేయాలంటే, లోతైన అధ్యయనం, హార్డ్వర్క్ అవసరమన్నారు. కొన్ని సందర్భాల్లో తాను విమర్శకులను మిస్ అవుతుంటానని తెలిపారు. వ్యాక్సిన్ డ్రైవ్ సక్సెస్ అంశంలో లాజిస్టిక్స్, ప్లానింగ్ లాంటి అంశాలను పరిశీలించాలని, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టామని, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతోందని, దాన్ని మీడియా హైలెట్ చేస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
నిజాయితీతో, మర్యాదపూర్వకంగా చెబుతున్నాను, విమర్శకులను చాలా గౌరవిస్తాను, కానీ దురదృష్టవశాత్తు విమర్శకులు తక్కువే ఉన్నారని మోదీ అన్నారు. చాలా వరకు జనం కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తారని, వాళ్ల ఆలోచనాసరళితో మాత్రమే గేమ్స్ ఆడే ప్రయత్నం చేస్తారన్నారు. ఎవరినైనా విమర్శించాలనుకుంటే, వాళ్లు చాలా హార్డ్వర్క్ చేయాల్సి ఉంటుందని, ఎంతో పరిశోధన చేస్తేనే ఓ విమర్శ చేయగలరని, ఈ నాటి ఫాస్ట్ పేస్ యుగంలో, బహుశా ప్రజలకు అంత సమయం లేదనుకుంటానన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో విమర్శకులను తాను మిస్సవుతున్నట్లు ఆయన తెలిపారు.