న్యూఢిల్లీ : ప్రభుత్వ పధకాలు, కార్యక్రమాల అమలు తీరుతెన్నులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జిల్లా మేజిస్ట్రేట్లు, అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు. సుపరిపాలనలో జిల్లా అధికారులు కీలక పాత్ర పోషించాలని, అధికారుల చొరవతోనే ప్రభుత్వ పధకాలు ప్రజలకు మెరుగైన రీతిలో చేరువవుతాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు, తనిఖీల కోసం మార్గదర్శకాలను రూపొందించుకోవాలని అధికారులను ప్రధాని కోరారు.
ప్రతి జిల్లా మరో జిల్లా విజయాలను చూసి నేర్చుకోవాలని సవాళ్లను అధిగమించాలని అన్నారు. పలు రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ సుపరిపాలన కోసం అధికారులు, ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాలు మెరుగుపడాలని సూచించారు. జిల్లాల్లో అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కార్యక్రమాలపై జిల్లా అధికారుల నుంచి ప్రధాని ఫీడ్బ్యాక్ తీసుకున్నారు.
పధకాల అమలులో సామర్ధ్యం పెంపుతో పాటు ఎదురవుతున్న సవాళ్లను సమీక్షించుకునేందుకు ఈ సమావేశం ఉపకరిస్తుందని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. పౌరుల జీవన ప్రమాణాలను పెంపొందించడంతో పాటు సమ్మిళిత వృద్ధి కోసం ప్రభుత్వ ఉద్దేశాలను నెరవేర్చే క్రమంలో ఈ సమావేశం జరిగిందని పీఎంఓ తెలిపింది. కాగా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా అధికారులతో ప్రధాని సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది.