భద్రతా వైఫల్యంపై నేడు సుప్రీంలో విచారణ
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రధాని మోదీ గురువారం భేటీ అయ్యారు. పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఆయనకు వివరించారు. దీనిపై కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ ట్విట్టర్లో వెల్లడించింది. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రధాని మోదీతో మాట్లాడారు. భద్రతా వైఫల్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
‘అడ్డుకుంది రైతులు కాదు’
పంజాబ్లో ప్రధాని పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ను అడ్డుకున్నది రైతులు కాదని సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది. బీజేపీ జెండాలు పట్టుకుని, మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఓ గుంపు ప్రధాని కాన్వాయ్ చెంతకు వెళ్లిందని తెలిపింది. మోదీ కాన్వాయ్వైపు వెళ్లేందుకు రైతులు కనీసం ప్రయత్నం కూడా చేయలేదని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రాణాలకు ముప్పు అన్న వాదనలు పూర్తిగా నిరాధారమని కొట్టివేసింది.