న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మిరమ్ తారన్ అనే బాలుడిని చైనాకు చెందిన ఆర్మీ ఎత్తుకెళ్లింది. సియాంగ్ జిల్లా నుంచి అతన్ని అపహరించినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఇవాళ ఓ ట్వీట్ చేశారు. రిపబ్లిక్ డేకు కొన్ని రోజుల ముందే దేశ భవిష్యత్తు అయిన ఓ యువ బాలుడిని చైనా కిడ్నాప్ చేసిందని, మిరమ్ తారన్ కుటుంబానికి అండగా తాము ఉన్నామని, ఓటమిని అంగీకరించమని, అతని కోసం పోరాడుతామన్నారు. కానీ ఈ ఘటన పట్ల ప్రధాని మోదీ మౌనం వీడాలన్నారు. కిడ్నాప్ అయిన అరుణాచల్ బాలుడిని మోదీ పట్టించుకోవడం లేదని రాహుల్ ఆరోపించారు.
రాష్ట్రంలోని లుంగ్తా జోర్ ప్రాంతం నుంచి మిరమ్ను అపహరించినట్లు ఎంపీ తాపిర్ గావో ఓ ట్వీట్లో తెలిపారు. తారన్ స్నేహితుడు జానీ యయింగ్ పీఎల్ఏ దళాల నుంచి తప్పించుకున్నాడని, ఆ కుర్రాడు ఇచ్చిన సమాచారంతో తారన్ కిడ్నాప్కు గురైనట్లు తెలుస్తోందని ఎంపీ తాపిర్ తెలిపారు. తారన్, యాయింగ్లు స్థానికంగా వేటకు వెళ్లేవారు. భారత్లోకి సాంగ్పో నది ప్రవేశించే ప్రాంతంలో అపహరణ ఘటన చోటుచేసుకున్నది. అరుణాచల్ ప్రదేశ్లోని సాంగ్పో ప్రవేశించినప్పుడు దాన్ని సియాంగ్ నదిగా పిలుస్తారు. అదే నది అస్సాంలో ప్రవేశించినప్పుడు బ్రహ్మపుత్రగా పిలుస్తారు.
2020 సెప్టెంబర్లో సిబాన్సిరి జిల్లాకు చెందిన అయిదుగురి యువకుల్ని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. భారతీయ ఆర్మీ జోక్యం చేసుకున్న వారం రోజుల తర్వాత వారిని విడిచిపెట్టారు