న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయం ఏర్పాటుకోసం నిర్మించిన కొత్త భవనం సేవాతీర్థ్ను ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సమీకృత భవనంలో పీఎంవోకు చెందిన కార్యనిర్వాహక వర్గానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించారు.
దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత ప్రధాని కార్యాలయం మరో భవనంలోకి మారడం ఇదే మొదటిసారి. దేశ పరిపాలనా వ్యవస్థలో ఇదో సరికొత్త మైలురాయి అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇతర కీలక మంత్రిత్వశాఖల కోసం నిర్మించిన కర్తవ్య భవన్ను కూడా ప్రధాని ప్రారంభించారు.
సేవా తీర్థ్లో ప్రధాని మొట్టమొదటిగా రైతులు, మహిళలు, యువజనులకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలకు ఆమోదం తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్సనందించే పీఎం రాహత్ స్కీమ్ తదితర పథకాలపై ఆయన సంతకం చేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సాయం అందించే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. బాధితులకు గోల్డెన్ అవర్లో ఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. స్టార్టప్ల కోసం రూ.10 వేల కోట్ల నిధులు కేటాయిస్తూ ప్రధాని సంతకాలు చేశారు.