న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: రూ.41 వేల కోట్ల విలువైన 2 వేలకు పైగా రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ సోమవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల పునరుద్ధరణలో భాగంగా 554 అమృత్ భారత్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు.
వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే విధంగా భారతీయ రైల్వే అత్యంత వేగంగా పరివర్తన చెందుతున్నదని పేర్కొన్నారు. పన్నుదారులు చెల్లించే ప్రతి పైసా ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. యువతతో పాటు అందరూ కలగంటున్న ‘అభివృద్ధి చెందిన భారత్’ను సాధించడమే తన సంకల్పమని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.