Modi | మానవజాతి ఈ శతాబ్దంలోనే అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరిరోజున ప్రధాని లోక్సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లు దేశంలో సంస్కరణలు, పనితీరు, పరివర్తనతో సాగాయన్నారు. సంస్కరణలు తీసుకురావడం, పనులు చేయడం, కళ్ల ముందు మార్పు రావడం చాలా అరుదు అన్నారు. 17వ లోక్సభకు అవసరమైన ఆశీర్వాదాలను దేశం కొనసాగిస్తుందని తాను విశ్వసిస్తున్నానన్నారు. గతంలో లోక్సభ స్పీకర్గా వ్యవహరించిన సుమిత్రా మహాజన్ పలు సందర్భాల్లో సరదాగా మాట్లాడే వారని.. ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా ముఖం ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుందన్నారు.
అనేక సందర్భాల్లో స్పీకర్ సభను స్ఫూర్తివంతంగా నడిపించారన్నారు. ఓపికగా, విజ్ఞతతో సభను నడిపించారని.. అందుకు రుణపడి ఉంటానన్నారు. ప్రధాని మోదీ ఐదేళ్లలో మానవ జాతి ఈ శతాబ్దంలోనే అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొందన్న ఆయన.. ఎవరు బతుకుతారు.. ఎవరు బతకగలరు.. ఎవరైనా ఎవరినైనా కాపాడగలరో లేదో.. అనే పరిస్థితి ఎదురైందంటూ కరోనా పరిస్థితులను గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో సభకు రావడం కూడా రిస్క్తో పని అన్న ప్రధాని.. ఆ సమయంలోనూ సభా కార్యక్రమాలను నిర్వహించారంటూ ప్రశంసించారు. కొవిడ్ సమయంలో ఎంపీ ఫండ్స్ను విడిచిపెట్టే ప్రతిపాదన వచ్చిన సమయంలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపారంటూ కృతజ్ఞతలు తెలిపారు.
దేశ ప్రజలకు సానుకూల సందేశం ఇవ్వాలని, సమాజానికి విశ్వాసం కల్పించేందుకు ఎంపీలు తమ జీతాలను 30శాతం తగ్గించాలని నిర్ణయించారన్నారు. కొత్త పార్లమెంటు భవనం కావాలని అందరూ చర్చించుకున్నారని.. కానీ మీ నాయకత్వమే ఈ పనిని ముందుకు తీసుకెళ్లిందన్న ఆయన.. దాని ఫలితమే నేడు దేశానికి కొత్త పార్లమెంటు భవనం వచ్చిందన్నారు. పార్లమెంటు కొత్త భవనంలో సెంగోల్ను వారసత్వ సంపదగా నిలిపేందుకు, స్వాతంత్య్ర తొలి క్షణాన్ని సజీవంగా ఉంచేందుకు కృషి చేశారన్నారు. ఇది భారతదేశం రాబోయే తరాలను స్వాతంత్ర్యం తొలినాటి క్షణాలతో ఎల్లప్పుడూ అనుబంధంగా ఉంచుతుందన్నారు.
ఇది దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందన్నారు. అందరి ఉమ్మడి కృషితో 17వ లోక్సభలో 97శాతం పని జరిగిందని.. ఇది స్వతహాగా సంతోషించదగ్గ విషయమన్నారు. ఏడు సెషన్లు 100 శాతం కంటే ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉన్నాయని.. రాత్రంతా మేల్కొని కూర్చుని ప్రతి ఎంపీ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేశారన్నారు. ఇంతటి విజయం సాధించిన ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తొలి సెషన్లో ఉభయ సభల్లో 30బిల్లులు ఆమోదం పొందాయని.. ఇది రికార్డు అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సంబురాలు చేసుకునే అవకాశం రావడం మనందరి అదృష్టమన్నారు.