Modi | న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం ఎంత ఉన్నది? ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి? కులాలవారీగా ఎవరి జనాభా ఎంత ఉన్నది? మొత్తంగా దేశ జనాభా ఎంత ఉన్నది? వంటి అనేక ప్రశ్నలకు ఏకైక సమాధానం జనగణన. దేశంలో ప్రతి పదేండ్లకోసారి జనాభా లెక్కలను సేకరించటం ఆనవాయితీ. చివరిసారి 2011లో జనాభా లెక్కలను సేకరించారు. 2021లో జన గణన చేపట్టాల్సి ఉన్నా కరోనా కారణంగా సాధ్యం కాలేదు. ఆ తర్వాత నుంచి దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నా కేంద్ర ప్రభుత్వం జన గణనపై దృష్టిపెట్టలేదు. కేంద్రం పెద్ద వ్యూహంతోనే జనగణనను జాప్యం చేస్తూ వస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు.
ప్రభుత్వాల పనితీరుకు పరీక్ష
జనగణన అంటే ఏదో ఆశామాషీగా జనాభా లెక్కలను సేకరించటం కాదు. చాలా వివరాలు సేకరిస్తారు. గత మూడు నాలుగేండ్లుగా ఓబీసీ జనాభా లెక్కలను కూడా ప్రత్యేకంగా సేకరించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు అమలుచేసిన విధానాలు, పథకాలు ప్రజల జీవితాల్లో ఎంతమేర మార్పులు తీసుకొచ్చాయనేది ప్రస్ఫుటమవుతుంది. అందుకే ఎన్నికల ముందు జనాభా లెక్కల వివరాలు ప్రకటించటానికి ఏ ప్రభుత్వమూ సుముఖంగా ఉండదు. మోదీ సర్కారు వ్యూహం కూడా సరిగ్గా అదేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడు జనాభా లెక్కలు సేకరిస్తే మోదీ సర్కారు పనితీరుకు అవి అద్దం పడుతాయి. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి, చమురు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటటంతో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని అనేక సర్వేలు ఇప్పటికే తేల్చాయి. అందుకే వీలైనంత జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని నిపుణులు పేర్కొంటున్నారు.
బడ్జెట్లో కోత..
సెన్సస్కు సంబంధించిన బడ్జెట్లో కేంద్రం మూడోవంతు కోత పెట్టింది. 2022-23 బడ్జెట్లో రూ.3,676 కోట్లు కేటాయించారు. 2023-24లో రూ.1,564 కోట్లకు తగ్గించారు. 2023-24 సవరించిన అంచనాల్లో ఏకంగా 552.65 కోట్లకు తగ్గించారు. గణాంక సర్వేలను సమీక్షించి ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు మోదీ సర్కారు నియమించిన ఆర్థికవేత్త ప్రణబ్సేన్ స్వయంగా ఈ మాటలన్నారు. ‘ఉద్యోగాలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటివి జనాభా లెక్కలపైనే ఆధారపడి ఉంటాయి. సరైన జనాభా లెక్కలు లేకపోతే ఈ గణాంకాలు కూడా కచ్చితత్వాన్ని ప్రతిబింబించవు’ అని పేర్కొన్నారు.