PM Modi : నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా తెలుగులో ప్రత్యేకంగా తన సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘ఉగాది పండుగ సంప్రదాయాలకు నెలవుగా ఉంటూనే, నూతన శక్తికి, సరికొత్త ఆరంభానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందం, విజయం, సంపూర్ణ ఆరోగ్యం నింపాలని ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరూ తమ ఆకాంక్షలను నెరవేర్చుకుని, సమాజానికి సానుకూలంగా సేవలందించేలా ఈ ఏడాది స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నా. అని పేర్కొన్నారు.
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పరాభవనామ ఉగాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలాగే, జీవితంలోని కష్టసుఖాలను, సవాళ్లను ఆశావాద దృక్పథంతో స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలకు శుభం, అదృష్టం తీసుకురావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.