ముంబై,మే 27: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) నుంచి సావరీన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం 2021-22 సిరీస్ వన్ స్కీం సబ్స్క్రిప్షన్ ఇటీవల ప్రారంభమైంది. ప్రభుత్వం గోల్డ్ బాండ్ ధరను (ఒక గ్రాముకు) రూ.4,777గా నిర్ణయించింది. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేవారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఎస్బీఐ కూడా ఈ బాండ్స్ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నది.
ఎస్బీఐ ఖాతాదారులు నేరుగా ఇ-సర్వీస్ల కింద ఈ బాండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఆర్బీఐతో సంప్రదించి భారత ప్రభుత్వం ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకునే పెట్టుబడిదారులకు ఇష్యూ ధర నుంచి గ్రాముకు రూ.50 తగ్గింపు ఆఫర్ ఇచ్చింది. చెల్లింపు డిజిటల్ మోడ్ ద్వారా చేసే ఇన్వెస్టర్లకు గోల్డ్ బాండ్ ఇష్యూ ధర గ్రాము బంగారానికి రూ. 4,727గా ధర నిర్ణయించారు.
ఎస్బీఐ ద్వారా మాత్రమే కాకుండా ఇతర మార్గాల్లోను గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. కమర్షియల్ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆర్బీఐ నియమించిన పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి కూడా బంగారు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. భౌతిక బంగారం డిమాండ్ను తగ్గించడానికి, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు ఉపయోగించే ఆర్థిక పొదుపుగా మార్చడానికి 2015 నవంబర్ నెలలో సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.