PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం అయిన ‘ఓలి దారాజలి దోస్త్లిక్’ అవార్డును ప్రధాని మోదీకి అందించింది. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ఈ పురస్కారాన్ని మోదీకి ఆదివారం అందజేశారు. మోదీకి దక్కిన 36వ అంతర్జాతీయ పురస్కారం ఇది.
ఉజ్బెకిస్తాన్, ఇండియా మధ్య బంధం బలోపేతం కోసం ఈ అవార్డును అంకితమిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. ఈ అవార్డు దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నానని, రెండు దేశాల మధ్య మైత్రికి ఇది నిదర్శనం అన్నారు. దోస్త్లిక్ అవార్డులోని దోస్త్ అంటే స్నేహం, స్నేహితుడు అని మోదీ గుర్తు చేశారు. భారత ప్రజల తరఫున ఉజ్బెకిస్తాన్కు, ఆ దేశ అధ్యక్షుడికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. మోదీ ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. శని, ఆదివారాల్లో ఆ దేశ రాజదాని తాష్కెంట్లో ఆయన పర్యటన సాగుతోంది. మోదీ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు, చర్చలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా వ్యాపారం, వాణిజ్యం, టెక్నాలజీ వంటి రంగాల్లో సహకారానికి, ద్వైపాక్షిక సంబంధాల పెంపునకు ఈ పర్యటన ఉపయోగపడనుంది. ఇరు దేశాల మధ్య యురేనియం సరఫరాకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. మరోవైపు ఇండియాపై ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. మోదీ నేతృత్వంలో ఇండియా అభివృద్ధి చెందుతోందని, రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయని అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ అన్నారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత మోదీ కిర్గిస్తాన్ వెళ్తారు. అక్కడ సెప్టెంబర్ 1 వరకు జరిగే ఎస్సీవో సదస్సులో మోదీ పాల్గొంటారు. అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది.