హైదరాబాద్, మే 24 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): బీజేపీలో కొనసాగుతున్న 75 ఏండ్ల రిటైర్మెంట్ గడువు ఒకవైపు ముంచుకొస్తున్నది. ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయోనన్న ఆందోళన మరోవైపు నిలకడగా ఉండనివ్వట్లేదు. వెరసి ఇంతకాలం తన మనసులో దాచిపెట్టుకొన్న పదవీ ఆకాంక్షను ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు బయటపెట్టారు. ఇంకో 23 ఏండ్లపాటు తాను క్రియాశీల రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇందుకోసం ‘వికసిత్ భారత్’ నినాదాన్ని ముందరేసుకొన్నారు. ఈ మేరకు ‘ఇండియా టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని కీలక విషయాలు వెల్లడించారు.
“వికసిత్ భారత్’ కల నెరవేర్చడం కోసం 2047 వరకు నిరంతరాయంగా శ్రమించే బాధ్యతను దేవుడు నా మీద పెట్టాడు. ఈ కార్యాన్ని పూర్తిచేయడానికే నన్ను భూమి మీదకు పంపించాడని నాకు అనిపిస్తున్నది. దీని కోసం దేవుడు నాకు దారిచూపించి, శక్తిని ఇచ్చాడు. 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తానన్న నమ్మకం నాకున్నది. అది నెరవేర్చే వరకు దేవుడు నన్ను పైకి పిలువడు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం మోదీ వయసు 74 ఏండ్లు. తాజా వ్యాఖ్యల ద్వారా మరో రెండు దశాబ్దాలకు పైగా తాను దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటానని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు, 75 ఏండ్లకు బీజేపీలో రిటైర్మెంట్ నిబంధన అనేది తనకు వర్తించబోదని ఆయన ఒకరకంగా చెప్పినట్టేనని అభిప్రాయపడుతున్నారు.