న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపర్వంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు భారతీయుడు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని పరిశీలించనున్నట్లు ప్రధాని మోదీ(PM Modi) తెలిపారు. కొన్ని ఘటనలు అమెరికా, భారత్ మధ్య బంధాన్ని బలహీనపరచలేవన్నారు. పన్నూను హత్య చేసేందుకు నిఖిల్ గుప్తాను కిరాయి తీసుకున్నట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు ప్రకటించిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీ ఆ అంశంపై పెదవి విప్పారు.
ఎవరైనా ఏదైనా సమాచారాన్ని అందజేస్తే దాన్ని పరిశీలిస్తామని ప్రధాని మోదీ అన్నారు. తమ దేశానికి చెందిన పౌరులు మంచి చేసినా, చెడు చేసినా.. ఆ అంశాన్ని పరిశీలించేందుకు తాము రెఢీగా ఉన్నామని, చట్టానికి తాము కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. బ్రిటీష్ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఒక సంఘటనను ఆధారంగా చేసుకుని, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీయాలనుకోవడం సరికాదు అన్నారు.
భారత్కు చెందిన ఓ అధికారి, 52 ఏళ్ల నిఖిల్ గుప్తాతో పన్నూ హత్యకు ప్లాన్ వేసినట్లు అమెరికా అధికారులు ఆరోపించారు. పన్నూ హత్యకు ప్లాన్ చేస్తే అప్పుడు ఇండియాలో నిఖిల్పై ఉన్న కేసుల్ని ఎత్తివేసేందుకు ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. పన్నూ హత్య కోసం అమెరికాలో నిఖిల్ ఓ గుండాను కిరాయి తీసుకున్నాడు. అయితే ఆ వ్యక్తి అమెరికా అండర్ కవర్ ఏజెంట్ అని తేలింది. ఒకవేళ పన్నూ హత్యకు కుట్ర చేసినట్లు ఆరోపణలు రుజువైతే అప్పుడు ఆ వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.