న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన, గాయపడిన వారికి ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనున్నారు. ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఈ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవాళ ఉదయం 7.30 గంటలకు దక్షిణ ముంబైలోని నానా చౌక్ ఏరియాలోగల కమలా బిల్డింగ్లో అగ్నిప్రమాదం సంభవించింది. 20 అంతస్తుల భవనంలోని 18వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఏడుగురు మరణించారు. మరో 16 మంది చికిత్స పొందుతున్నారు.
అయితే, అగ్నిప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలావుంటే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.