న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ కొవిడ్ వ్యాక్సినేషన్ నిదానంగా సాగుతున్న జిల్లాల మెజిస్ట్రేట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 40 జిల్లాలు వ్యాక్సినేషన్ ప్రక్రియలో వెనుకబడి ఉన్నాయి. ఈ 40 జిల్లాల్లో మొదటి డోస్ తీసుకున్న వారి సంఖ్య 50 శాతం కూడా తగ్గలేదు. ఇక రెండో డోస్ కూడా చాలా తక్కువగా స్థాయిలో పూర్తయింది. దాంతో ఆ 40 జిల్లాల కలెక్టర్లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.
వ్యాక్సినేషన్లో వెనుకబడ్డ ఆ 40 జిల్లాలు జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయా రాష్ట్రాల్లో ఉన్నాయని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. అందుకే ప్రధాని మోదీ జీ-20, కాప్-26 సదస్సుల్లో పాల్గొని విదేశాల నుంచి తిరిగి రాగానే వ్యాక్సినేషన్పై ఆయా జిల్లాల అధికారులతో సమావేశమయ్యారు. వ్యాక్సినేషన్ను మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా 10.34 కోట్ల మంది గడువు ముగిసినా సెకండ్ డోస్ తీసుకోలేదని ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ చేసిన ప్రకటన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.