ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను నిలదీశారు. మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వంలో భాగమైన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను బీజేపీ నేత, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షా తమ మంత్రి బెదిరింపులను ఖండిస్తారా లేక సమర్థిస్తారా అని ప్రశ్నించారు. శరద్ పవార్ను ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే గురువారం సాయంత్రం ఒక ట్వీట్ చేశారు. ‘శరద్ పవార్, శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. వారు మహారాష్ట్ర శాసనసభకు రావాలంటున్నారు. వారు ఖచ్చితంగా వచ్చి వారి ఇష్టానుసారం ఓటు వేస్తారు. వారికి ఏదైనా హాని జరిగితే, మీరు ఇంటికి వెళ్లడం కష్టం’ అని రాణే మరాఠీలో హెచ్చరించారు.
కాగా, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే చేసిన ఈ ట్వీట్పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. దీనిని ఖండిస్తూ శుక్రవారం ఒక ట్వీట్ చేశారు. ‘మహా వికాస్ అఘాడీని కాపాడేందుకు శరద్ పవార్ ప్రయత్నిస్తే, ఇంటికి వెళ్లనివ్వబోమని, నడిరోడ్డుపై నిలువరిస్తామని కేంద్ర మంత్రి బెదిరిస్తున్నారు. బీజేపీ చేసేది ఇదే అయితే ఆ విషయాన్ని మీరే (మోదీ, అమిత్ షా) ప్రకటించండి. ప్రభుత్వమైనా, ఓ కేంద్ర మంత్రి అయినా శరద్పవార్ను ఉద్దేశించి అలా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదు’ అని ట్వీట్ చేశారు. ‘ఆయన (శరద్ పవార్) మహారాష్ట్ర కుమారుడు. మోడీ జీ, అమిత్ షా మీరు ఇది విన్నారా? మీ మంత్రి శరద్ పవార్ను బెదిరిస్తున్నారు. మీరు అలాంటి బెదిరింపులకు మద్దతిస్తారా? మహారాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు’ అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ను ప్రధానమంత్రి కార్యాలయానికి ఆయన ట్యాగ్ చేశారు. శివ సైనికులు ఇప్పటి వరకు రోడ్లపైకి రాలేదని, అవసరమైతే రంగంలోకి దిగుతారంటూ సంజయ్ రౌత్ హెచ్చరించారు.
महाविकास आघाडीचे सरकार वाचवण्याचा प्रयत्न केला तर शरद पवार यांना घरी जाऊ देणार नाही .रस्त्यात अडवू.अशी धमकी भाजपचा एक केंद्रीय मंत्री देतो.ही भाजपची अधिकृत भूमिका असेल तर तसे जाहीर करा. सरकार टिकेल किंवा जाईल..पण शरद पवार यांच्या बाबत अशी भाषा महाराष्ट्राला मान्य नाहीं@PMOIndia pic.twitter.com/YU1Pc39vCb
— Sanjay Raut (@rautsanjay61) June 24, 2022