Rs 2000 Notes | ఎలాంటి గుర్తింపు రుజువు లేకుండా రూ.2000 నోట్లను మార్చుకోవచ్చన్న రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. రిక్విజిషన్ స్లిప్, ఐడీ లేకుండా రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు వీలు కల్పిస్తూ ఆర్బీఐ, ఎస్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ బీజేపీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ సతీశ్కుమార్ శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ ధర్మాసనం పిటిషన్ను తిరస్కరించింది.
అయితే, వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, మావోయిస్టలు, డ్రగ్ స్మగ్లర్లు, మైనింగ్ మాఫియా, అవినీతిపరుల వద్ద నోట్ల నిల్వలు ఉన్నాయని అశ్విని ఉపాధ్యాయ్ వాదించారు. నోటిఫికేషన్లు ఏకపక్షంగా, సహేతుకంగా లేవని, రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘిస్తున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన నోటిఫికేషన్ను సమర్థించింది. ఇది పెద్ద నోట్ల రద్దు కాదని, చట్టబద్ధమైన చర్యని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈ 19న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ వరకు అవకాశం కల్పించింది. బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడంతో పాటు ఎలాంటి పత్రాలు లేకుండా మార్చుకోవచ్చని స్పష్టం చేసింది.