న్యూఢిల్లీ: తటస్థ వేదికపై పాకిస్థాన్తో టెస్టు క్రికెట్ ఆడేందుకు తనకు ఏమీ ఇబ్బంది లేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. పాక్ బౌలింగ్ లైనప్ బాగుంటుందని, ఆ జట్టుతో టెస్టు ఆడితే రసవత్తరంగా ఉంటుందని రోహిత్ పేర్కొన్నారు. 2008 ముంబై దాడుల తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక టెస్టు క్రికెట్ సిరీస్ జరగలేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఆ రెండు జట్లు తలపడుతున్నాయి. క్లబ్ ప్రెయిరి ఫైర్ అనే యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడారు.
పాకిస్థాన్ మంచి జట్టు అని నమ్ముతానని, వాళ్ల బౌలింగ్ లైనప్ బలంగా ఉంటుందని, ఆ జట్టుతో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నామని, తటస్థ వేదికపై పాక్తో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు రోహిత్ తెలిపారు. ఈ రెండు జట్ల మధ్య చివరి టెస్టు 2007-08లో జరిగింది. అప్పటి నుంచి ఇండోపాక్ జట్లు టెస్టులు ఆడడం లేదు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇండోపాక్ మ్యాచ్లను నిర్వహించేందుకు తమకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. అయితే ప్రభుత్వం అనుమతి ఇస్తేనే రెండు దేశాల మధ్య టెస్టు క్రికెట్ ఉంటుందని పలుమార్లు బీసీసీఐ చెప్పిన విషయం తెలిసిందే.