న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దక్షిణ సూడాన్ రాజధాని జుబా శివారు ప్రాంతంలో ప్రయాణికుల విమానం కూలి.. 14 మంది దుర్మరణం పాలయ్యారు. సిటీ లింక్ ఏవియేషన్కు చెందిన ‘సెస్నా-208 కారవాన్’ అనే చిన్నపాటి విమానం సోమవారం ఉదయం యెయ్ నుండి జుబా విమానాశ్రయానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. రాజధాని జుబా నైరుతి దిశలో సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కుప్పకూలింది. విమానం పైలట్ సహా అందరూ మరణించారని దక్షిణ సూడాన్ పౌర విమానయాన సంస్థ తెలిపింది. మృతుల్లో ఇద్దరు కెన్యా జాతీయులు, 12 మంది దక్షిణ సూడాన్ జాతీయులు ఉన్నట్టు తెలిసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.43 నిమిషాలకు విమానం టేకాఫ్ కాగా, 30 నిమిషాల తర్వాత దాంతో సంబంధాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం, సరైన వెలుతురు లేకపోవటమే విమానం దుర్ఘటనకు
కారణమని ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి.