న్యూఢిల్లీ: స్నేహితురాలిని కాక్పిట్లోకి అనుమతించిన పైలట్ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సస్పెండ్ చేసింది. అలాగే ఈ సంఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా (Air India) సంస్థకు రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న దుబాయ్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో ఆ సంస్థకు చెందిన ఉద్యోగిని ప్రయాణించింది. అయితే స్నేహితురాలైన ఆ మహిళను కాక్పిట్లోకి పైలట్ ఆహ్వానించాడు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆ విమానానికి చెందిన మొత్తం సిబ్బందిని గ్రౌండ్ చేసింది.
కాగా, ఈ సంఘటనకు సంబంధించిన దర్యాప్తుపై నివేదిక అందడంతో డీజీసీఏ చర్యలు చేపట్టింది. దీనిని తీవ్రమైన తప్పిదంగా పరిగణించింది. స్నేహితురాలైన మహిళను కాక్పిట్లోకి అనుమతించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఇంచార్జ్ పైలట్ లైసెన్స్ను మూడు నెలలపాటు సస్పెండ్ చేసింది. ఈ సంఘటనను నివారించని కోపైలట్కు వార్నింగ్ ఇచ్చింది.
మరోవైపు భద్రతాపరమైన, సున్నితమైన ఈ అంశానికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియా సంస్థకు డీజీసీఏ చీవాట్లు పెట్టింది. సత్వర దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు రూ.30 లక్షల జరిమానా కూడా విధించింది. అలాగే ఆ విమానంలోని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది.