న్యూయార్క్: ఇటీవల మరణించిన ఫోటో జర్నలిస్టు డానిష్ సిద్ధిక్కు రెండవ సారి పులిట్జర్ ప్రైజ్ దక్కింది. ఫీచర్ ఫోటోగ్రఫీ క్యాటగిరీలో ఆయనకు ఈ అవార్డు దక్కడం విశేషం. రైటర్స్ వార్తా సంస్థకు చెందిన సిద్ధికీతో పాటు అద్నన్ అబిది, సన్నా ఇర్షాద్ మట్టూ, అమిత్ దావేలు ఈ టీమ్లో ఉన్నారు. ఇండియాలో కోవిడ్ సమయంలో తీసిన ఫోటోలకు పులిట్జర్ అవార్డు వరించింది. ఆ ఫోటోలు కోవిడ్ భయానక స్థితికి అద్దం పట్టినట్లు పులిట్జర్ తన వెబ్సైట్లో పేర్కొన్నది.
38 ఏళ్ల సిద్ధిక్ గత ఏడాది ఆఫ్ఘనిస్తాన్లో ప్రాణాలు కోల్పోయాడు. ఆఫ్ఘన్ సైన్యం, తాలిబన్ల మధ్య జరిగిన ఘర్షణ సమయంలో అతను బుల్లెట్లకు బలయ్యాడు. 2018లో మొదటి సారి సిద్ధిక్ పులిట్జర్ అవార్డు గెలుచుకున్నాడు. రోహింగ్యా సంక్షోభంపై తీసిన ఫోటోలకు అప్పట్లో ఆ అవార్డు గెలిచాడతను. ఢిల్లీలోని జామియా ఇస్లామియా కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు. జామియాలోనే మాస్ కమ్యూనికేషన్ కూడా పూర్తి చేశాడు.