భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో (Odisha train tragedy) మరణించిన 288 మంది పలు రాష్ట్రాలకు చెందిన వారు. దీంతో మృతులను గుర్తించడం కష్టంగా ఉందని ఒడిశా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మరణించిన వారి ఫొటోలను మూడు వెబ్సైట్లలో ఉంచారు. రైలు ప్రయాణికుల వివరాలతోపాటు మృతుల ఫొటోలను స్పెషల్ రిలీఫ్ కమిషనర్ (ఎస్ఆర్సీ), భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఓఎస్డీఎంఏ) వెబ్సైట్లో ఉంచినట్లు ఒడిశా ప్రభుత్వ అధికారులు తెలిపారు. అయితే చిధ్రమైన మృతుల ఫొటోలు భయానకంగా ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఒడిశా రిలీఫ్ కమిషన్ నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా ఎవరూ కూడా ఈ ఫొటోలను ప్రచురించకూడదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మృతులను గుర్తించిన బాధిత కుటుంబాలు 1929 హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని చెప్పారు.
కాగా, ఒడిశా రాజధాని భువనేశ్వర్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ప్రజలు ఈ కార్యాలయాన్ని సంప్రదించడం ద్వారా చికిత్స పొందుతున్న వారి వివరాలు, మృతుల వివరాలు, మృతదేహాల గుర్తింపు కోసం సమాచారం, సహాయాన్ని పొందవచ్చని అధికారులు తెలిపారు. మూడు వెబ్సైట్లలోని లింక్ ద్వారా కూడా రైలు ప్రమాద మృతులను గుర్తించవచ్చని పేర్కొన్నారు. అయితే ముందస్తు అనుమతి లేకుండా రైలు ప్రమాద మృతుల ఫొటోలను మీడియాతో సహా ఎవరూ ప్రచురించకూడదని పేర్కొన్నారు.
https://www.bmc.gov.in/train-accident-deceased-injured
https://srcodisha.nic.in/Photos%20Of%20Deceased%20with%20Disclaimer.pdf