భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అవినీతికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే చౌహాన్కు వ్యతిరేకంగా ఆ పార్టీ మధ్యప్రదేశ్లో పోస్టర్ల ప్రచారం చేపట్టింది. 50 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లు సీఎం శివరాజ్పై ఆ పార్టీ ఆరోపణలు చేసింది. పోస్టర్లలో ఫోన్ పే(PhonePe) క్యూఆర్ కోడ్ను ప్రింట్ చేసి దాంట్లో శివరాజ్ బొమ్మను చేర్చారు. అయితే ఆ పోస్టర్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భోపాల్లో వెలసిన ఆ పోస్టర్లపై ఫోన్ పే కంపెనీ స్పందించింది. ఆ పోస్టర్ల నుంచి తమ లోగోను తీసివేయాలని ఫోన్ పే సంస్థ కోరింది. తమ బ్రాండ్ లోగోను అనుమతి లేకుండా మూడవ వ్యక్తి వాడుకోవడం సరికాదు అని ఫోన్ పే తెలిపింది. రాజకీయాలకైనా, రాజకీయేతర విషయాలకు కూడా లోగోను ఇలా వాడవద్దు అని తన ట్వీట్లో చెప్పింది. అనుమతి లేకుండా లోగోను వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫోన్ పే కంపెనీ తెలిపింది.
PhonePe objects to the unauthorized usage of its brand logo, by any third party, be it political or non-political. We are not associated with any political campaign or party.
— PhonePe (@PhonePe) June 26, 2023