Rameshwaram blast case : ఫోన్ రిపేర్కు ఇవ్వడంవల్లే బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసు నిందితులు పోలీసులకు చిక్కారు. బాంబు పేలుడుకు పాల్పడి దాదాపు 42 రోజులపాటు తప్పించుకు తిరిగిన నిందితులను గురవారం ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. మార్చి 1న కేఫ్లో పేలుడుకు పాల్పడిన అనంతరం పారిపోయిన నిందితులు.. వివిధ రాష్ట్రాల్లో తప్పించుకుతిరిగారు. ఈ క్రమంలో 35 సిమ్లు, ఫేక్ ఆధార్, డ్రైవింగ్ లైసెన్సులతో దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించారు. కానీ, చివరకు పాడైన తమ సెల్ఫోన్ను రిపేర్కు ఇచ్చి దర్యాప్తు అధికారులకు చిక్కారు.
బాంబు పేలుడు అనంతరం తప్పించుకు తిరుగుతున్న నిందితుల్లో ఒక నిందితుడి సెల్ఫోన్లో సమస్య తలెత్తింది. దాంతో కోల్కతాలోని చాంద్నీ చౌక్ మార్కెట్లోగల ఓ దుకాణంలో రిపేర్కు ఇచ్చారు. అయితే ఆ ఫోన్లో మాత్రం సిమ్కార్డులు లేవు. దాంతో మైక్రోఫోన్లో ఏదైనా సమస్య ఉందా? అని తెలుసుకోవడానికి మొబైల్ దుకాణం యజమాని తన దగ్గరున్న ఓ సిమ్ కార్డును అందులో పెట్టి చూశాడు. అదే నిందితులను పట్టించింది. రిపేర్కు ఇచ్చిన రోజు సాయంత్రమే నిందితుడు ఫోన్ కోసం వచ్చినా రిపేర్ పూర్తికాకపోవడంతో షాప్ యజమాని మరుసటి రోజు రమ్మని చెప్పాడు.
అప్పటికే నిందితుల ఫోన్ను ట్రాక్ చేస్తున్న పోలీసులకు మొబైల్ షాప్ యజమాని సిమ్ కార్డు వేయడంతో ట్రేజ్ అయ్యింది. దాంతో అప్రమత్తమైన పోలీసులు ఫోన్ ఐఎంఈఐ నంబరు ఆధారంగా ఆచూకీ కనుగొన్నారు. వెంటనే మొబైల్ షాప్కు చేరుకుని మొబైల్ దుకాణం యజమాని స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. అతడు చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా కోల్కతా శివారులోని దిఘా ప్రాంతంలోని ఓ హోటల్లో ఉన్న నిందితులు ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితులు ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు.