New Delhi : ఢిల్లీ మాల్వియ నగర్లోని ఫ్లోరిష్ స్టేస్ హోటల్లో బుధవారం ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 21 మంది మరణించారు. వీరిలో 17 మంది విదేశీయులున్నారు. ఈ ప్రమాద ఘటనతో ఢిల్లీ ప్రభుత్వం అలర్టైంది. ఢిల్లీలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. నెల రోజులపాటు ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఫైర్ డిపార్ట్మెంట్ సహా వివిధ విభాగాలకు చెందిన అధికారులు నగరవ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించారు.
అయితే, ఈ తనిఖీల కారణంగా పీజీ హాస్టళ్లను ఉన్నట్లుండి మూసేస్తుండటంతో చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ పోలీసులు, మున్సిపల్, ఫైర్ సేఫ్టీ సహా వివిధ విభాగాలకు చెందిన అధికారులు నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, కమర్షియల్ బిల్డింగ్స్లలో తనిఖీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాల్వీయ నగర్లో అధికారులు మరింతఅప్రమత్తం అయ్యారు. ఇక్కడ తనిఖీల సందర్భంగా సరైన ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించని కొన్ని పీజీ (పెయింగ్ గెస్ట్)లను అధికారులు మూసేస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు మళ్లీ ఎక్కడికి వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారు. అలాగే, కొన్ని చోట్ల పీజీ నిర్వాహకులే విద్యార్థులను బయటకు పంపించేస్తున్నారు.
అక్కడి కొన్ని రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి. ఫైర్ ఇంజిన్ వాహనం రావడానికి కూడా అవకాశం లేకుండా రోడ్లు ఉన్నాయి. అనేక హోటళ్లు సరైన అనుమతులు లేకుండానే నడుస్తున్నట్లు గుర్తించారు. వీటిపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. హోటల్ అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో అధికారులు ఫుల్ అలర్ట్గా పని చేస్తున్నారు. నెల రోజులపాటు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగనుంది. మరోవైపు ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో ప్రధాన నిందితుడైన ఫ్లోరిష్ స్టేస్ హోటల్ యజమాని లవకేష్ బజాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.