Alimony | ముంబై: ‘పెంపుడు జంతువులు కూడా మనలో భాగమే. మన నిత్య జీవితంలో కుటుంబ సభ్యుల్లా మమేకమైపోయిన వాటిని వేరుగా చూడలేం. అందుకే వాటి నిర్వహణ బాధ్యతలకు కూడా పరిహారం చెల్లించాల్సిందే.’ అని భరణం కేసులో కోర్టు తీర్పు చెప్పింది. మధ్యంతర నెలవారీ భరణం కింద నెలకు రూ.50 వేలను తన 55 ఏండ్ల భార్యకు చెల్లించాలని బాంబే మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్సింగ్ రాజ్పుట్ తీర్పునిచ్చారు.
భరణంలో కుక్కల నిర్వహణ వ్యయాన్ని కలపరాదంటూ భర్త చేసిన విజ్ఞప్తిని ఆయన తిరస్కరించారు. కేసు వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త అయిన భర్త (34)తో విభేదాల కారణంగా ఒక మహిళ వేరుగా ఉంటున్నది. ఆమె భర్తపై గృహ హింస కేసు పెట్టింది. తనకు ఆదాయ వనరు లేదని, తన మూడు కుక్కల నిర్వహణ బాధ్యత కూడా తనపై ఉందని, నెలకు 70 వేలు భరణంగా ఇప్పించాలంటూ ఆ మహిళ కోర్టులో కేసు వేసింది. అయితే దీన్ని ఆమె భర్త తిరస్కరించారు. భార్యకు భరణం ఇవ్వడమే కష్టమంటే కుక్కల నిర్వహణ వ్యయం కూడా అడగడం అన్యాయమని వాదించారు. దాన్ని మేజిస్ట్రేట్ కోమల్ సింగ్ తిరస్కరిస్తూ వాటి నిర్వహణకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ తీర్పు చెప్పారు.