న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మే నెలలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు(Petrol-Diesel Sales) గణనీయంగా పెరిగాయి. వ్యవసాయానికి డిమాండ్ పెరగడంతో పాటు ఎండాకాలంలో ఏసీ కార్ల వల్ల అధిక స్థాయిలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరిగినట్లు పరిశ్రమలు అంచనా వేస్తున్నాయి. మే నెలలో డీజిల్ డిమాండ్ దాదాపు 9.3 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. అంటే గత ఏడాది మే నెలతో పోలిస్తే దాదాపు 7.46 మిలియన్ టన్నులు డీజిల్ను అధికంగా వాడారు.
ఏప్రిల్ నెలలో డీజిల్ వినియోగం గత ఏడాదితో పోలిస్తే 6.7 శాతం పెరిగిందని, ఆ తర్వాత మే నెలలో ఇక అమ్మకాలు మరీ జోరందుకున్నాయని, ఒక్క నెలలోనే అమ్మకాలు 4.2 శాతం పెరిగినట్లు పరిశ్రమల ప్రాథమిక డేటా ద్వారా అంచనా వేశారు.
ఇక మే నెలలో పెట్రోల్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 10.4 శాతం పెరిగాయి. అంటే 3.08 మిలియన్ టన్నుల పెట్రోల్ను అధికంగా అమ్మారు. ఇక మార్చి నెలతో పోలిస్తే .. పెట్రోల్ అమ్మకాలు 16.5 శాతం పెరిగినట్లు డేటా పేర్కొన్నది. మార్చి నెలలో రెండో అర్ధభాగం నుంచి పెట్రోల్, డీజిల్ వినియోగం గణనీయంగా పెరిగినట్లు అంచనా వేశారు.