న్యూఢిల్లీ, అక్టోబర్ 9: కశ్మీర్లో హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకొని ఇటీవల జరుగుతున్న హత్యలపై సుప్రీం కోర్టు దృష్టి సారించాలని ఢిల్లీకి చెందిన లాయర్ వినీత్ జిందాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ హత్యలు అనంత్నాగ్లోని ఛత్తీసింగ్పొరాలో 2000వ సంవత్సరంలో 36 మంది సిక్కుల ఊచకోత ఘటనను గుర్తుకు తెస్తున్నదని పేర్కొన్నారు. ఇటీవలి ఘటనల కారణంగా భయంతో హిందువులు, సిక్కులు కశ్మీర్ లోయ నుంచి మళ్లీ జమ్ముకు వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్లో మైనారిటీలకు తగిన భద్రత కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కోరారు. ఐదు రోజుల్లో ఏడుగురి హత్య జరిగినట్టు పత్రికల్లో వచ్చిన వార్తలను లేఖలో ప్రస్తావించారు.