న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: నారీ శక్తి.. నారీశక్తి అంటూ చెప్పటం కాదు, కోస్ట్గార్డ్లో మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్ను అమలుజేయాలి.. అంటూ కేంద్రాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు పర్మినెంట్ కమిషన్ అమలుజేయటం లేదని మహిళా కోస్ట్గార్డ్ ఉద్యోగి ప్రియాంక త్యాగీ దాఖలుచేసిన పిటిషన్పై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ‘నారీ శక్తి.. నారీ శక్తి అంటూ చాలా మాట్లాడుతున్నారు (కేంద్రాన్ని ఉద్దేశించి). అదిక్కడ చూపి.. నిబద్ధత చాటుకోండి. పితృస్వామ్య ఆలోచనతో ఉన్నారు’ అని సీజేఐ అన్నారు. భారత సైన్యం, నేవీలో అమలవుతున్న విధానం, కోస్ట్గార్డ్లో ఎందుకు నిరాకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆర్మీ, నేవీతో పోల్చితే కోస్ట్గార్డ్ అన్నది మహిళలకు భిన్నమైనదన్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ విక్రంజిత్ బెనర్జీ వాదనను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. సరిహద్దుల వద్ద భద్రతను చేపడుతున్న మహిళలు, తీర ప్రాంతాన్ని కూడా రక్షిస్తారని ధర్మాసనం తెలిపింది.