(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ‘వద్దే వద్దు.. ఈ బీజేపీ సర్కారు. ఆ పార్టీకి ఓటేస్తే ధనవంతులకే లాభం. మాకు కాదు. అవినీతి సర్కారు అది. రైతులు, పేదలు, మధ్య తరగతికి ఆ పార్టీ చేసిందేమీ లేదు. వేరే పార్టీ అధికారం చేపట్టాల్సిందే’.. ఇదీ గుజరాత్లోని సగటు సామాన్య ఓటరు అభిప్రాయం. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో డబుల్ ఇంజిన్ సర్కారు పట్ల పేదలు, మధ్య తరగతి ప్రజలు, గ్రామీణులు అనుకూలంగా లేరు. ఇటీవల ‘బీజేపీ సర్కారు’ పనితీరుపై గుజరాత్లో లోక్నీతి-సీఎస్డీఎస్ సంస్థ ప్రజాభిప్రాయం సేకరించింది. అందులో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల్లో మెజారిటీ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టు తేలింది. బీజేపీ సర్కారు సంపన్నులకే లాభం చేకూర్చేలా ఉందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు అవినీతిమయంగా మారిందని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మరో పార్టీ అవసరమని ఆ రెండు పార్టీలకు ఓటు బ్యాంక్గా ఉండేవారే అభిప్రాయపడటం గమనార్హం. మూడో ప్రత్యామ్నాయంగా ఆమ్ఆద్మీ పార్టీ ఎదుగుదలను వారు స్వాగతించారు. కొత్త పార్టీ అవసరమని బీజేపీకి అనుకూలంగా ఉండే 54 శాతం మంది కోరుకోవటం విశేషం. గ్రామాల్లో రైతులతో పాటు, ఇతర వర్గాల ప్రజలు కూడా బీజేపీపై అసంతృప్తితో ఉన్నట్టు సర్వేలో తేలింది.