న్యూఢిల్లీ: వరకట్న మరణం కేసులో ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) ఇవాళ ఓ కీలక సూచన చేసింది. శిశువుల లింగాన్ని నిర్దారించేది పురుషుడి క్రోమోజోములే అని, దీనిపై సమాజంలో అవగాహన కల్పించాల్సి ఉందని కోర్టు తెలిపింది. కోడలు తమకు వంశోద్ధారకుడిని ఇవ్వలేదన్న కోపంతో దాడులు జరుగుతున్నాయని, ఈ విషయంలో తల్లితండ్రులకు శాస్త్రీయ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొన్నది. శిశువు లింగాన్ని నిర్దారణ పురుషుడి క్రోమోజోమ్తో జరుగుతుందని, స్త్రీల క్రోమోజోమ్ వల్ల కాదు అని కోర్టు చెప్పింది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తెలిపారు.
అడిగినంత కట్నం ఇవ్వలేదని, ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చిందన్న కోపంతో ఓ కోడలిపై అత్తామామ వేధింపులకు పాల్పడ్డారు. అయితే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో అరెస్టు అయిన భర్త.. బెయిల్ అభ్యర్థన పెట్టుకున్నారు. అత్తారింట్లో కోడళ్ల పరిస్థితి దారుణంగా ఉందని, కొత్త పెళ్లి కూతురు భర్త ఇంట్లో వేధింపులకు గురి అవుతున్నట్లు కోర్టు అభిప్రాయపడింది. అయితే ఆడపిల్లలు కనే విషయంలో జన్యు శాస్త్రాన్ని విస్మరిస్తున్నారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.
మహిళల్లోని XX, పురుషుల్లోని XY క్రోమోజోముల వల్ల పిల్లల లింగ నిర్ధారణ జరుగుతుందని జస్టిస్ స్వర్ణకాంత్ తెలిపారు. కొడుకు వల్లే కూతురు పుట్టిందన్న విషయాన్ని తల్లితండ్రులు గ్రహించాలని, ఈ విషయంలో ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని జస్టిస్ శర్మ సూచించారు. భర్త వేధింపుల వల్లే భార్య ఆత్మహత్య చేసుకున్నదని, అందుకే వరకట్న వేధింపుల కేసులో బెయిల్ ఇవ్వడం లేదని కోర్టు తెలిపింది.