గువహటి : అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ గురువారం కీలక ప్రకటన చేశారు. బాల్య వివాహాలు చేసుకునే వారితో పాటు వాటిల్లో పాలుపంచుకునే వారిని శుక్రవారం నుంచి అరెస్టు చేస్తామని ప్రకటించారు. 18 ఏండ్లు నిండని అమ్మాయిలను వివాహం చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివాహ వయసు నిండని బాలికలను ఇప్పటికే పెళ్లి చేసుకున్న వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.
ఇక 14 ఏండ్ల లోపు బాలికలను పెళ్లి చేసుకుంటే.. అలాంటి వ్యక్తులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బాల్య వివాహాలను నిరోధించాలనే ఉద్దేశంతో ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సీఎం ప్రకటన చేశారు. బాల్య వివాహాలను నిరోధించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. ఈ విషయంలో ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని సీఎం కోరారు. ఇప్పటికే బాల్యవివాహాలపై అసోం వ్యాప్తంగా 4,004 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు.