లక్నో: కొద్ది మంది జంతు ప్రేమికులు తప్ప.. చాలామంది కుక్కలను చూస్తే చీదరించుకుంటారు. అవి దగ్గరికి రాబోతే దూరం వెళ్లగొడుతారు. కానీ వాళ్లు మాత్రం వందేళ్లుగా కుక్కను పూజిస్తున్నారు. ఇంతకూ ఎవరు వాళ్లు..? అని ఆలోచిస్తున్నారా..? అయితే అక్కడికే వస్తున్నా. ఉత్తర్ప్రదేశ్లోగల ఒక బైరవుని ఆలయంలో ఈ శునక పూజలు జరుగుతున్నాయి. ఆ ఆలయంలోని శునకం విగ్రహాన్ని పూజించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఆ శునకం విగ్రహం పాదాలకు నల్లదారం కట్టి ఏదైనా కోరుకుంటే అది జరిగి తీరుతుందని స్థానికులు బలంగా నమ్ముతారు.
దాదాపు 100 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్షెహర్లోని సికందరాబాద్లో బాబా లటూరియా అనే ఒక గురువు ఉండేవారు. మంచిచెడు అడిగేందుకు ఆయన దగ్గరికి చాలా మంది వస్తుండేవారు. ఆ క్రమంలోనే ఆయన ఆ ప్రాంతంలో ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఆ ఆలయంలో ఉంటూ ఆయన ఒక కుక్కను పెంచుకున్నారు. ఆ కుక్కను ఆయన బైరవ్ బాబాగా పిలిచేవారు. స్థానికులకు కూడా అదే పిలుపు అలవాటైంది.
అయితే, తన చివరి రోజుల్లో బాబా లటూరియా తాను నిర్మించుకున్న గుడిలోనే సజీవ సమాధికి సిద్ధమయ్యారు. బాబా సమాధిలోకి వెళ్లిన తర్వాత ఆయన భక్తులు దాన్ని మూసివేస్తుండగా బైరవ్ అందులోకి దూకింది. వెంటనే బాబా భక్తులు దాన్ని బయటికి తీసి సమాధిని మూసేశారు. కానీ, ఆ తర్వాత కాసేపటికే బైరవ్ మరణించింది. దాంతో బైరవ్కు గుర్తుగా ఆ ఆలయంలో ఓ విగ్రహాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు. ఏటా హోలీ, దీపావళి పండుగలకు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళ, శనివారాల్లో బైరవ్ దర్శనానికి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.