తిరువనంతపురం: కేరళలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎప్పటికప్పుడు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వర్షాల కారణంగా ఆశ్రయం కోల్పోయిన వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా 105 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు విజయన్ తెలిపారు.
పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని పునరావాస కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. ఎడతెరపి లేని వర్షాలవల్ల పతనమ్థిట్ట, కొట్టాయం, తిరువనంతపురం జిల్లాల్లోని మడమోన్, కల్లుప్పర, తుంపమాన్, పుల్లకయార్, మనిక్కల్, వెల్లయ్కడవ, అరువిపురం డ్యామ్లు నిండుకుండల్లా మారాయని వెల్లడించారు.