లక్నో: ‘ముందు ఓటు, తర్వాతే భార్య, మరే పనైనా..!’. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిది. ఎన్నికల్లో మనం వేసే ఓటుతోనే సరైన పాలకులను ఎన్నుకోవచ్చు. ఓటు విలువను గుర్తించిన ఓ పెండ్లి కొడుకు చెప్పిన మాటలివి. ప్రస్తుత కాలంలో ఓట్లు వేయడానికి జనాలు బద్ధకిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మరీ తక్కువగా ఓటింగ్ శాతం నమోదవుతున్నది. ఎన్నికలు జరుగుతున్న రోజును సెలవు దినంగానే పరిగనిస్తున్నవారికి ఓ పెండ్లి కొడుకు ఇలా విలువైన సందేశం ఇచ్చాడు.
ఉత్తరప్రదేశ్లోని 11 జిల్లాల్లో తొలిదశ పోలింగ్ జరుగుతున్నది. అందులో ముజఫర్నగర్ కూడా ఉన్నది. పట్టణానికి చెందిన అంకుర్ బల్యాన్ వివాహం గురువారం జరగనున్నది. ఈ క్రమంలో పెళ్లి కొడుకుగా ముస్తాబైన అతడు ఓటింగ్ డే కావడంతో.. వివాహ వేదికకు బదులు నేరుగా పోలింగ్ బూత్కు వెళ్లాడు. లైనులో నిలబడి తన వంతు వచ్చినప్పుడు ఓటుహక్కు వినియోగించుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ముందు ఓటు, తర్వాతే భార్య, మరో పనైనా’ అని చెప్పాడు.
#WATCH | "Pehle matdaan, uske baad bahu, uske baad sab kaam," says Ankur Balyan, a bridegroom who had come to cast his vote at a polling booth in Muzaffarnagar ahead of his wedding today.#UttarPradeshElections2022 pic.twitter.com/KaYsv5s2Bb
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 10, 2022
యూపీలో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 11 గంటల వరకు 20.03 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
తొలి దశలో 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో తొమ్మిది మంది మంత్రుల భవితవ్యం తేలనుంది. 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 412 కంపెనీలకు చెందిన 50 వేల మంది కేంద్ర పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు.
403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి గురువారం నుంచి మార్చి 7 మధ్య ఏడు విడుతల్లో పోలింగ్ జరుగనున్నది. మిగతా నాలుగు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, గోవాలో 14న, పంజాబ్లో 20న, మణిపూర్లో ఈ నెల 27, మార్చి 3న పోలింగ్ జరుగనున్నది. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.