న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టే పెగాసస్ స్పైవేర్ వివాదంపై సుప్రీంకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఈ స్పైవేర్కు సంబంధించి 2017లో ఇజ్రాయెల్, భారత్ మధ్య జరిగిన ఒప్పందంపై విచారణ కోరుతూ న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఒప్పందాన్ని పార్లమెంట్ ఆమోదించలేదని, అందువల్ల దానిని రద్దు చేసి ఆ డబ్బును రికవరీ చేయాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని, పెగాసస్ స్పైవేర్ కొనుగోలు ఒప్పందంపై విచారణ జరిపించాలని, న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజా నిధుల దుర్వినియోగంపై కూడా విచారణ జరిపించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆయన కోరారు. కాగా, సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ జరుపుతున్న పెగాసస్ స్పైవేర్ కేసులోని అసలు పిటిషనర్లలో ఈయన కూడా ఒకరు.
మరోవైపు 2017లో భారత్, ఇజ్రాయెల్ మధ్య సుమారు 2 బిలియన్ డాలర్ల మేర ఒప్పందం జరిగిందని, అత్యాధునిక ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలు, పెగాసస్ స్పైవేర్ కేంద్రకంగా ఈ డీల్ జరిగిందని న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ‘ది బ్యాటిల్ ఫర్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ సైబర్ వెపన్’ పేరుతో ఈ నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్వో గ్రూప్, దాదాపు ఒక దశాబ్దం పాటు తన నిఘా సాఫ్ట్వేర్ను ప్రపంచవ్యాప్తంగా చట్టబద్ధ ప్రభుత్వాలు, ఏజెన్సీలు, గూఢచార సంస్థలకు చందా ప్రాతిపదికన విక్రయిస్తోందని పేర్కొంది.
ఏదైనా ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లను తమ పెగాసస్ స్పైవేర్ నిలకడగా, విశ్వసనీయంగా క్రాక్ చేస్తుందని, ఇలాంటిది మరెవరూ చేయలేరంటూ ఆ సంస్థ హామీ కూడా ఇచ్చిందని న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. దీంతో ఈ రిపోర్ట్ ఆధారంగా న్యాయవాది ఎంఎల్ శర్మ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దేశంలోని కొంతమంది వ్యక్తులపై నిఘా కోసం పెగాసస్ను ఉపయోగించారనే ఆరోపణలపై ఇప్పటికే విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు గత ఏడాది అక్టోబర్ 27న ముగ్గురు సభ్యుల సైబర్ నిపుణుల ప్యానెల్ను నియమించింది.