హైదరాబాద్: శబరిమల అయ్యప్పస్వామి నేటి నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నాడు. మండల పూజ ముగియడంతో డిసెంబర్ 26న ఆలయాన్ని మూసివేశారు. అయితే మకర విళక్కు కోసం ఆలయాన్ని గురువారం సాయంత్రం తెరిచారు. దీంతో నేటి నుంచి అయ్యప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. వచ్చే నెల 19 వరకు శబరిమల ఆలయం తెరిచి ఉండనుంది. ప్రతిరోజూ వేకువజామున 4 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులకు మణికంఠుని దర్శనభాగ్యం కలగనుంది. మళ్లీ సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతించనున్నారు.
కరోనా నేపథ్యంలో మూతపడిన పెద్దపాదం రెండేండ్ల తర్వాత తెరచుకున్నది. ఆదివారం నుంచి పెద్దపాదం మార్గంలో భక్తులకు అనుమతించనున్నారు. నీలక్కల్, ఎరుమేలి వద్ద దర్శనం కోసం స్పాట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. టికెట్ బుక్చేసుకున్న భక్తులు కొవిడ్ నెగెటివ్ ధ్రువపత్రం తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. హరివాసనం తర్వాత వచ్చే నెల 19న ఆలయాన్ని మూసివేయనున్నారు.