న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై విపక్షాలు భగ్గుమన్నాయి. రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం బడ్జెట్కు మెరుగులు దిద్దినట్టు కనిపించిందని పెదవివిరిచాయి. సామాన్యులకు ఆసరాగా నిలవాల్సింది పోయి వారికి అందించే సంక్షేమ పథకాలు, సబ్బిడీల్లో కోత విధించారని నిర్మల బడ్జెట్పై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.
దారిద్ర్య రేఖ ఎగువకు చేరిన వారు సైతం మోదీ సర్కార్ నిర్వాకంతో తిరిగి దారిద్ర్య రేఖకు దిగువన పడిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎనిమిదేండ్ల బడ్జెట్ల తరహాలోనే ప్రస్తుత బడ్జెట్ కూడా ఉందని పన్నులు పెంచారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలు, సబ్సిడీలపై ఖర్చు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొద్దిమంది పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారులకు దోచిపెట్టేందుకు పన్నులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పన్ను రాబడితో ప్రజలు బాగుపడాలి కానీ పన్నులతో ప్రజల వెన్ను విరుస్తున్నారని మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నిర్మల బడ్జెట్పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, టీఎంసీ నేత శత్రుజ్ఞ సిన్హా సహా పలువురు విపక్ష నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.