రాహుల్ గాంధీ ఎంత చెబితే అంతే… ఆయన మాటే నా మాట… సీఎం అభ్యర్థిగా ఎవర్ని ప్రకటించినా.. నాకు సమ్మతమే… అంటూ చిలుక పలుకులు పలికిన పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ మాత్రం లోలోన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంజాబ్ సీఎం అభ్యర్థిగా చెన్నీని ప్రకటించారో.. అప్పటి నుంచే సిద్దూ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారన్నది ఆయన ఆంతరంగికుల మాట. ఇప్పుడు ఇదే మాట తీవ్ర ప్రచారంలో ఉంది. సరిగ్గా ఎన్నికల వేళ… సిద్దూ లాంటి స్టార్ క్యాంపెయినర్ పార్టీ విషయంలో అలకపాన్పు ఎక్కితే.. ఎలాగని మరో వర్గం అసహనం వ్యక్తం చేసింది. ఇక ఆయన సతీమణి నవజ్యోత్ కౌర్ ప్రవర్తన కూడా సీఎం అభ్యర్థిని ప్రకటించగానే మారిపోయింది. ఓ జాతీయ మీడియా ఈ కథనాన్ని పేర్కొంది.
అధిష్ఠానం ఎక్కడ ప్రచారానికి ఆదేశిస్తే అక్కడికి సిద్దూ వెళ్తారని మొదట్లో పేర్కొన్నారు ఆయన భార్య. ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా మాట మార్చేశారు. కేవలం ఆయన సొంత నియోజకవర్గంలోనే ప్రచారం చేస్తారని సిద్దూ భార్య పేర్కొన్నారు. సీఎం అభ్యర్థిని ఎలాగూ ప్రకటించారని, ఇక ఆయనే ప్రచారం చేస్తే బాగుంటుందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఓ మాట అనడం, సిద్దూ ఓ మాట అనడం ద్వారా లేనిపోని గందరగోళం నెలకొంటుందని, దీనిని నివారించడానికి సీఎం అభ్యర్థే ప్రచారం చేస్తే బాగుంటుందని సిద్దూ భార్య నవజ్యోత్ కౌర్ చురకలంటించారు. అయితే ఇన్ని వ్యాఖ్యలు చేసిన సిద్దూ భార్య… చివరగా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని సమర్థించే మాటలే మాట్లాడారు. పంజాబ్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పంజాబ్లో చెన్నీ- సిద్దూ మోడల్ను అమలు పరుస్తారని కొత్త పల్లవి అందుకున్నారు. సీఎం కుర్చీలో ఎవరున్నా తమకు అభ్యంతరం మాత్రం లేదని సిద్దూ సతీమణి నవజ్యోత్ కౌర్ చివరగా అన్నారని ఆ జాతీయ మీడియా కథనం పేర్కొంది.