పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉంటారు. తాజాగా విజయ్ శర్మకు సంబంధించిన ఓ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 2022లో జరిగిన ఓ కారు యాక్సిడెంట్ కేసులో విజయ్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 22న ఈ ఘటన జరిగింది. విజయ్ శర్మ.. తన జాగ్వర్ లాండ్ రోవర్ కారును ఢిల్లీలో నడుపుతూ వెళ్తున్నారు. మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరికి రాగానే.. విజయ్ శర్మ కారును.. డీసీపీ బెనితా మేరీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయ్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు విజయ్కు బెయిల్ మంజూరు చేసింది.
అయితే.. యాక్సిడెంట్ కాగానే విజయ్ శర్మ కారుతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. డీసీపీ బెనితా కారును నడిపిన కానిస్టేబుల్ దీపక్ కుమార్.. లాండ్ రోవర్ కారు నెంబర్ను నోట్ చేసుకున్నాడు. ఆ విషయాన్ని డీసీపీకి చేరవేశాడు. దీంతో కారు నెంబర్ ప్రకారం అది విజయ్ శర్మ కారుగా గుర్తించారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసి ఆ తర్వాత బెయిల్పై రిలీజ్ చేశామని ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి సుమన్ నాల్వా తర్వాత మీడియాకు తెలిపారు.