భోపాల్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. విద్యుత్ బిల్లు బకాయిలు చెల్లిస్తేనే ఎన్నికల్లో పోటీకి అర్హులని పేర్కొంది. ఆ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. సోమవారం నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. జనవరి 6న తొలి దశ, 28న రెండో దశ, ఫిబ్రవరి 16న మూడో దశ ఎన్నికలు జరుగుతాయి. ప్రతి దశలో ఓటింగ్ అనంతరం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
అయితే, విద్యుత్ బిల్లులు పెండింగ్లో ఉన్న అభ్యర్థుల నామినేషన్లను రద్దు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్, జనపద్ పంచాయతీ, జిల్లా పంచాయతీకి పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతోపాటు సంబంధిత ఎంపీ విద్యుత్ పంపిణీ సంస్థ జారీ చేసే నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ను కూడా అందజేయాలి. కాగా, విద్యుత్ బకాయిలు చెల్లించని ధృవీకరణ పత్రాలను కూడా ప్రస్తుతానికి రిటర్నింగ్ అధికారికి ఇవ్వవచ్చు.
అభ్యర్థి ఈ సర్టిఫికెట్ పొందేందుకు వీలుగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్తు పంపిణీ కేంద్రాలకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్తు కనెక్షన్లు లేని వారు అదే విషయాన్ని పేర్కొంటూ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లా ఎన్నికల కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.